సోషల్ మీడియాకు దూరంగా యూపీఎస్సీ టాపర్లు
సాధారణంగా 20-25 ఏళ్ల మధ్య యువత గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ చూడాలి? ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాం, లింక్డ్ఇన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లోనే కదా. కానీ, గతేడాది జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారందరూ మాత్రం.. పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కేవలం పరీక్షల మీద మాత్రమే దృష్టి పెట్టారు. అదే వారి విజయసూత్రం. జైపూర్ నుంచి ఆలిండియా టాపర్ అయిన కనిష్క్ కటారియా ఇలా చెప్పారు.. “నేను ఫేస్బుక్, ట్విట్టర్ ఎకౌంట్స్ డీయాక్టివేట్ చేసుకున్నాను. అవన్నీ టైం వేస్ట్ అని నాకు అనిపించింది. ఇన్ స్టాగ్రాంలో ఉన్నాను గానీ వాటిని కూడా చాలా తక్కువగా వాడతాను. అప్పుడు కూడా నాకు బాగా దగ్గరవాళ్లతోనే కనెక్ట్ అయ్యాను.”
నాలుగో ర్యాంకర్ రాజస్థాన్ వాసి శ్రేయాన్స్ కుమత్, ఐదో ర్యాంకర్ భోపాల్ వాసి జయంత్ దేశ్ముఖ్, 13వ ర్యాంకు సాధించిన బిలాస్పూర్ వాసి వర్నీత్ నేగి కూడా ఇదే చేశారు. కర్ణాటక టాపర్, ఆలిండియా 17వ ర్యాంకర్ అయిన హుబ్లీ వాసి రాహుల్ శరణప్ప సంకనూర్ అయితే.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడటం మొదలుపెట్టాడు. వాట్సాప్ లో కొన్ని గ్రూపులు పెట్టుకుని.. వాటి ద్వారా మెటీరియల్ ఒకరికొకరు పంచుకునేవాళ్లమని అక్షత్ జైన్ చెప్పాడు. అప్పుడప్పుడు రిలాక్స్ అవడానికి ఐదు నిమిషాలు ఫేస్ బుక్ చూసేవాడిని తప్ప ఏనాడూ ఏమీ పోస్ట్ చేయలేదని అన్నాడు.
26 ఏళ్ల ఐపీఎస్ అధికారి తన్మయి వసిష్ట శర్మ తాను మాత్రం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలను వాడినట్టు తెలిపారు. “ట్విట్టర్ కాదు కానీ, కొన్ని జాతీయ పత్రికలను ఫాలో అవ్వడానికి ఫేస్బుక్ వాడాను. యూట్యూబ్ లో రాజ్యసభ ప్రొసీడింగ్స్ సివిల్ సర్వీసెస్ కి సిద్ధం అవ్వడానికి చాలా తోడ్పడతాయి” అని చెప్పారు. టాపర్లందరిలో ఉన్న మరో పోలిక ఏంటంటే.. టాప్ 50లో 27 మంది ఇంజనీర్లే. మిగిలినవాళ్లలో కూడా ఎంబీయే చదివినవాళ్లు ఎవరూ లేరు. వీరిలో ఇద్దరు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్, ఇంగ్లీష్ సాహిత్యం చదివిన ఒకరు ఉండడం విశేషం. అంతేకాదు, టాపర్లలో చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి సివిల్స్ కు వచ్చినవాళ్లే. వీరిలో కటారియా దాదాపు ఏడాదిపాటు దక్షిణ కొరియాలో శాంసంగ్ కంపెనీలో పనిచేశారు. కుమత్ కూడా ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో రెండేళ్లు పనిచేసి, తర్వాత సివిల్స్ వైపు దృష్టిపెట్టారు.
ఐఏఎస్ ల పిల్లలు…
ర్యాంకర్లలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పిల్లలున్నారు. కటారియా తండ్రి రాజస్థాన్ లో ఐఏఎస్ అధికారి. ప్రియదర్శిని తండ్రి విదేశాంగ శాఖలో కార్యదర్శి. అక్షత్ జైన్ తండ్రి సీబీఐ జాయింట్ డైరెక్టర్, తల్లి సీనియర్ ఐఆర్ఎస్ అధికారిణి. లక్నోకు చెందిన గుంజన్ ద్వివేది (9వ ర్యాంకు) రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుమార్తె. దీక్షా జైన్ (22వ ర్యాంకు) తండ్రి ఢిల్లీలోని ఐపీఎస్ అధికారి.