అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక కొరత కారణంగా పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు వీధిన పడ్డారని, కొంతమంది ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం మేల్కొని ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ఆ లేఖలో సీఎంను కోరారు. సీఎం వైఎస్ జగన్ పాలనను చూస్తుంటే… మీరు పూర్తి అభద్రతా భావంలో ఉన్నారనే విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
‘నదులలో నిత్యం నీరు ఉండే రోజులు, లేని రోజులు ప్రజలకు తెలుసు, కానీ నీరు ఉండటం వల్ల ఇసుక కొరత అన్నది ప్రభుత్వ పక్షాన చెప్పడం చాలా తప్పు. ఇసుక ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరం.. దానికి ప్రభుత్వం అడ్డం పడరాదు. ఇసుక అందించలేనపుడు రాష్ట్రం దాటకుండా నిఘా పెట్టి.. రాష్ట్రం లోపల ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ ఇసుకను ఉచితంగా తీసుకునేలా వెంటనే ఆదేశాలు ఇవ్వండి. ప్రజలు సుఖంగా బతికేలా పాలన ఉండాలి. ఇసుక కొరత లాంటి కారణాలు ప్రజల ఆత్మహత్యలకు దారితీయడం దారుణం. సమాజంలో మేధావి నుండి సామాన్యుడి వరకూ ఇసుక పాలసీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భూములు అమ్మబోతున్నారన్న వార్తలు వింటున్నాం. ఎన్నికల సమయంలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా పెట్టాలని చూస్తున్నారు. వాటి అమలుకు తేదీలు ప్రకటిస్తున్నారు. కానీ అందులో మా కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం మా కాపులు చేసుకున్న పాపంగా భావిస్తున్నాం. మీరు పరిపాలన చేస్తున్న తీరు మీరు తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోంది’ అని జగన్కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.