ముంబై: ఆదాయపు పన్ను శాఖ అధికారులు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వారి పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు బ్లాక్మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చారు. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది. 2019, మార్చి 28న ఆదాయ పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది.
అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు అనేక దేశాల్లో వీరికి ఉన్న విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం. వ్యాపారవేత్తలపై దర్యాప్తు ప్రారంభించిన తరువాత 2011 లో, హెచ్ఎస్బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. 2015 లో, స్విస్ లీక్స్ గా పిలిచే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) హెచ్ఎస్బీసీ జెనీవా ఖాతాదారుల సంఖ్య 1,195 అని పేర్కొంది. 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్తో 14 హెచ్ఎస్బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్ను ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ఇవన్నీ అనేక మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో అనుసంధానించబడ్డాయని తెలిపింది.
ఈ 14 కంపెనీలలో ఒకదానిలో “అంతిమ లబ్ధిదారులు” గా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయనీ, వివిధ విదేశీ, దేశీయ సంస్థల ద్వారా ఈ సంస్థలలో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటి నివేదిక వెల్లడించినట్టు పేర్కొంది. ముంబైలోని అదనపు ఆదాయ పన్ను కమిషనర్ ద్వారా బ్లాక్ మనీ సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ), టాక్స్ యాక్ట్ 2015 ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలను రిలయన్స్ ప్రతినిధులు ఖండించారు. అలాగే ఐటీ శాఖ నోటీసులేవీ తమకు అందలేదని తెలిపారు.