ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్టీ). ఇప్పుడు ప్రమాదం జరగడం వల్లే కాదు, గతంలో కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. చాలాకాలం పాటు దీన్ని కసబ్ బ్రిడ్జి అని పిలిచేవారు. 26/11 ఉగ్రవాద దాడుల సమయంలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్లాడు. 2008 నవంబరు 26వ తేదీన ఇద్దరు ఉగ్రవాదులు ఏకే -47 తుపాకులు పట్టుకుని సీఎస్టీ టెర్మినస్ ప్రయాణికుల హాల్లోకి ప్రవేశించారు. అక్కడున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గుంపుగా ఉన్న ప్రజలపై బాంబులు కూడా విసరడంతో 58 మంది మరణించారు. మరో 104 మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రమాదానికి గురైన బ్రిడ్జి మీద నుంచే ఉగ్రవాదులు వెళ్లారు. దగ్గరలో ఉన్న కామా ఆసుపత్రికి వాళ్లు వెళ్లారు. అప్పుడే ముంబైకి చెందిన ఫొటోగ్రాఫర్ సెబాస్టియన్ డిసౌజా కసబ్ ను ఫొటో తీశాడు. తర్వాత ఆ ఫొటోయే అతడిని దోషిగా తేల్చడానికి సాయపడింది.
గురువారం రాత్రి ఈ బ్రిడ్జి కుప్పకూలడంతో ఆరుగురు మరణించగా, 33 మంది గాయపడ్డారు. పగటిపూట ఆ బ్రిడ్జి మీద మరమ్మతు పనులు జరుగుతున్నా, తర్వాత సాయంత్రం మాత్రం దాన్ని ప్రయాణికుల రాకపోకలకు అనుమతించారు. ఈ విషయాన్ని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా సీఎస్టీ గుర్తింపు పొందింది. ఇది మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం. ప్రతిరోజూ 2,500 రైళ్లలో 7 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దాంతో ఇది నగరంలో అత్యంత ప్రధానమైన స్టేషనుగా నిలిచింది.