అమరావతి: ఏపీ రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని మాత్రమే తాను అన్నానని, అయితే కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాప్లో అమరావతిని గుర్తించకపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. తాము రాజధానిని అభివృద్ధి చేసే యోచనలో ఉన్నామని.. త్వరలోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని బొత్స స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం తెచ్చిన లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులో నుంచి కనీసం ఐదు వేల కోట్లు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయలేదని, ఈ విషయాన్ని వారు మర్చిపోతే ఎలా? అని ప్రశ్నించారు. వ్యతిరేక వార్తల్ని వీరే పత్రికల్లో రాయించి, అవే వార్తలను పట్టుకుని గందరగోళం సృష్టిస్తారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు.. ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో టీడీపీ డిమాండ్ చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం నెలకొందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. అమరావతి ఐదుకోట్ల మంది ప్రజల కలల రాజధాని అని అన్నారు. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలన్నారు.