పట్నా: జంట హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఓ ఖైదీ గ్రాండ్ గా తన బర్త్ డే పార్టీని జరుపుకున్నారు. ఈ ఘటన బీహర్ లో చోటుచేసుకుంది. పింటూ తివారీ అనే ఖైదీ జైల్లో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, ఇతర ఖైదీలకు స్వీట్లు పంచి పెట్టాడు. అంతేకాదు, తన జన్మదినం సందర్భంగా అందరికీ మటన్ బిర్యానీతో విందు ఏర్పాటు చేశాడు. జైలులోని కొందరు ఖైదీల నుండి గిఫ్టులు కూడా స్వీకరించాడు. ఈ బర్త్ డే వేడుకలను ఓ ఖైదీ మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Bihar: Four guards of the jail have been suspended in connection with the incident where a criminal Pintu Tiwari, in a video, was seen celebrating his birthday inside the jail premises. https://t.co/pE41NLJc7N
— ANI (@ANI) September 1, 2019
2015లో బీహార్లోని దర్భంగలో ఇద్దరు ఇంజనీర్లను హత్య చేసిన కేసులో పింటూ తివారి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తనకు రౌడీ మామూలు ఇవ్వలేదన్న కోపంతో తన ముఠా సాయంతో వారిని చంపేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. పింటూ తివారీకి కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో ప్రస్తుతం బీహార్ లోని సీతామార్హి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా పింటూ తన పుట్టినరోజు వేడుకలు మరోసారి వార్తల్లో నిలిచాడు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నలుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేసి..విచారణకు ఆదేశించారు.