అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి ప్రకటనను ఎవరూ ఆశించలేదు.
తెలుగు మీడియాలో ఈ వార్త రాగానే జాతీయ మీడియా కూడా అప్రమత్తం అయింది. ఎందుకంటే దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రీ ఈ ప్రయోగం చెయ్యలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ చేయబోతున్నది ఖచ్చితంగా దేశంలో ప్రప్రధమం.
ఇప్పుడిక ఆ అయిదుగురూ ఎవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి మేకతోటి సుచరిత, కె. పార్ధసారది, అంజాద్ బాషా, రాజన్న దొర, ఆళ్ల నానీ పేర్లు వినబడుతున్నాయి. వీరిలో పార్ధసారధి బిసి వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఈయన కృష్ణాజిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎస్సి వర్గానికి చెందిన సుచరిత గుంటూరు జిల్లా, పత్తిపాడు నుంచి ఎన్నికయ్యారు. ఆమెకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తే అటు ఎస్సి కోటాకింద, ఇటు మహిళ కోటా కింద ఇచ్చినట్లవుతుంది. ఇక సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర ఎస్టి వర్గానికి చెందిన వారు. జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి వచ్చిన అంజాద్ బాషా మైనారిటీ కోటా కిందకు వస్తారు. ఇక కాపు వర్గం నుంచి వినపడుతున్న ఆళ్ల నానీ పేరు కాస్త అశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి విజయనగర జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ చాలా సీనియర్. ఆయనకు డిప్యూటీ సిఎం పదవి నిజంగా కాదంటే అందుకు ప్రాంతం ఒక్కటే కారణం అవుతుంది. ఉత్తరాంద్ర నుంచి ఎస్టికి ప్రాతినిధ్యం ఇస్తే అక్కడ నుంచే బొత్సకు అవకాశం ఇవ్వలేరు. పైగా మధ్య కోస్తాలోని ఉభయగోదావరుల నుంచి అయిదుగురిలో ఒక్కరన్నా డిప్యూటీ సిఎం ఉండాలిగదా!