ముంబై: ప్రతిపక్షాలకు ధైర్యముంటే కశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ… విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కశ్మీర్ లో భవిష్యత్తులో తిరిగి ఆర్టికల్ 370ని తీసుకురాగలరా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తీసుకొస్తామని తమ మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని ఆయన సవాలు విసిరారు. దేశ ప్రజలు ఇందుకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ లో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారి హక్కులను తాము పునరుద్ధరిస్తామని మోదీ చెప్పారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంపై కొందరు నేతలు మొసలి కన్నీరు కార్చుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రతిపక్షాలు తీసుకునే నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విరుద్దంగా ఉంటున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రను అభివృద్ది పథంలో నడిపిస్తున్న బీజేపీ-శివసేన కూటమిని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.
हमारे लिए 5 अगस्त का निर्णय अटल है और जम्मू-कश्मीर और लद्दाख को नए रास्ते पर ले जाने का निश्चय भी अटल है।
आज मैं विरोधियों को चुनौती देता हूं कि अगर आपमें हिम्मत है, तो इस चुनाव में और आने वाले चुनावों में भी अपने चुनावी घोषणा पत्र में ऐलान करें कि हम 370 को वापस लाएंगे: पीएम pic.twitter.com/uJ7vKIegYL
— BJP (@BJP4India) October 13, 2019
అక్టోబర్ 21న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. దీంతో ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒకే రోజు మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సభల్లో, ప్రధాని మోదీ రెండుచోట్ల ప్రచారం చేస్తుండగా, రాహుల్ మూడుచోట్ల ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత రాహుల్ ప్రచార సభల్లో పాల్గొనడం ఇదే ప్రథమం.
జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ ను పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రోజునే పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. చట్టసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాష్ట్రపతి ఆగస్ట్ 9న విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలతోపాటు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారు ఇప్పటికీ గృహ నిర్భందంలోనే ఉన్న సంగతి తెలిసిందే.
నిజానికి బీజేపీ ఈ ఆర్టికల్ 370ని చాలా కాలం నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. పుల్వామా దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ అంశానికి శాశ్వత పరిష్కారం ఆర్టికల్ 370 రద్దుతోనే సాధ్యం అవుతుందని బీజేపీ నిర్ణయించింది. అయితే, ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ తో సహా మిగతా పక్షాలన్నీ వ్యతిరేకించాయి.