న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేకప్రతిపత్తి వర్తింపును రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జమ్ము కశ్మీర్ విభజనను కూడా ఆ పార్టీ సవాలు చేసింది. ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు మొహమ్మద్ అక్బర్ లోన్, హస్నైన్ మసూదీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
లోన్ జమ్ము కశ్మీర్ అసెంబ్లీ మాజీ స్పీకర్. మసూదీ గతంలో జమ్ము కశ్మీర్ హైకోర్టు జడ్జిగా పని చేశారు. ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలో శాశ్వత భాగమని 2015లో ఆయన తీర్పు చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కింద జమ్ము కశ్మీర్ ప్రజలకు లభించిన ప్రాధమిక హక్కులను రాష్ట్రపతి ఉత్తర్వు, పార్లమెంట్ చేసిన చట్టం హరిస్తున్నాయని వారు పిటిషన్లో పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజల సమ్మతి లేకుండా వారి హక్కులను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని వారు వాదించారు.
రాష్ట్రం రాష్ట్రపతి పాలన కింద ఉండగా, చట్టబధ్ధ పాలననూ, లాంఛనమైన విధులనూ తుంగలో తొక్కి కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా 370 ఆర్టికల్ను తొలగించడం ఏ విధంగా సబబో సుప్రీంకోర్టు పరిశీలించాలని వారు కోరారు.
జమ్ము కశ్మీర్కు రాజ్యాంగంలోని ఇతర నిబంధనలు వర్తింపజేసేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370(1)(డి)ని ఏకంగా ఆర్టికల్ 370ని మార్చేందుకే ఉపయోగించుకుంటూ రాష్ట్రపతి మొదటి ఉత్తర్వు జారీ చేశారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ కేసు భారతదేశ సమాఖ్య విధానం స్ఫూర్తినే ప్రభావితం చేస్తుందని వారు పేర్కొన్నారు.