(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్సి) వివాదం కొనసాగుతుండగానే బిజెపి ప్రభుత్వం మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పిఆర్)ను సవరించాలని కేంద్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. అయితే దీనిపై భయాందోళనలకు ఆస్కారం లేదనీ, ఎన్ఆర్సికీ ఎన్పిఆర్కూ మధ్య లింకు లేదనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభుత్వ పధకాలకు ప్రాతిపదికగా ఉపయోగపడే జాబితా ఎన్పిఆర్. ఈ దేశ పౌరసత్వం ఏ లెక్కన వచ్చిందో తేల్చే కసరత్తు ఎన్ఆర్సి అని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్పిఆర్ డేటాను ఎన్ఆర్సికి ఉపయోగించబోమని ఆయన స్పష్టం చేశారు.
అయినప్పటికీ ఎన్పిఆర్పై సందేహాలు వ్యక్తం అవుతూనేఉన్నాయి. కనీసం రెండు రాష్ట్రాలు – పశ్చిమ బెంగాల్, కేరళ – ఎన్పిఆర్ కసరత్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అస్సాం మినహా మిగిలిన రాష్ట్రాలలో ఈ రిజిస్టర్ సవరణ జరుగుతుంది. 8,500 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రక్రియ జనాభా లెక్కల కమిషనర్ అధ్వర్యంలో జరుగతుంది.