(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఇటీవల అమరావతి ప్రాంతంలో జరిగిన ఘటనలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించి ఏపి పోలీసులకు నోటీసు జారీ చేసింది. మహిళా రైతుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోని రైతాంగం విశాఖకు రాజధానిని తరలించడానికి వీలులేదంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో రైతు కుటుంబాలకు చెందిన పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొంటున్నారు.ఇటీవల నిరసన తెలియజేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించి తరలించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రతిఘటిస్తూ పోలీస్ వ్యాన్ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో వ్యాన్ నుండి మహిళలను పోలీసులు దించి వేశారు. ఈ సమయంలో మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దుర్భషలాడారనీ పలు ఛానళ్లల వార్తలు ప్రసారం అయ్యాయి.
ఈ ఘటనలను సీరియస్గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్..ఏపి డిజిపికి నోటీసు పంపింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ గౌరవ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆదేశించారు. నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకొని మహిళా రైతులకు భద్రత ఎలా కల్పించాలన్నది నిర్ణయిస్తామన్నారు. మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సమర్థనీయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
@NCWIndia has taken suo-motto congnizance on the alleged reports of women farmers brutally beaten and throttled by Andhra Pradesh Police during their protest against State government on decision of shifting capital to Vizag. pic.twitter.com/DXYQyp63Cb
— NCW (@NCWIndia) January 8, 2020