ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు విపక్షంలోనే కూర్చుంటాయని శరద్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. శివసేనతో ఎన్సీపీ చేతులు కలపదని ఆయన తేల్చి చెప్పారు. శివసేన – ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రశ్నే లేదన్నారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని శరద్ పవార్ మీడియా ముఖంగా కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం శివసేనకు ఎక్కడ ఉందని పవార్ ప్రశ్నించారు. బీజేపీ, శివసేన పార్టీలకు అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారని, వీలైనంత తొందరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత శాసనసభ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగుస్తున్నప్పటికీ… ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇంత వరకు ఒక్క అడుగు కూడా పడలేదు. 50:50 ఫార్ములాకు కట్టుబడి తమకు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఇవ్వాలన్న శివసేన డిమాండ్ కు బీజేపీ తలొగ్గలేదు. మరోవైపు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన ఎంపీ సంజర్ రౌత్ బుధవారం మరోసారి భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీని కాదని ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన యత్నిస్తోందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా పవార్ ప్రకటనతో శివసేనకు ఎన్సీపీ మద్దతు ఇవ్వనుందన్న ఊహాగానాలకు తెర దించినట్లయింది. ‘గత 25 ఏళ్ల నుంచి బీజేపీ – శివసేన కలిసి ఉన్నాయి. ఇవాళ, రేపో ఆ రెండు పార్టీలే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి’అని పవార్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సమావేశాల్లో ఇరు పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న అంశాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై మాత్రమే సంజయ్ రౌత్ చర్చించినట్లు పవార్ తెలిపారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ బీజేపీ – శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.