(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ నాయకుడు శరద్ పవారే అని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్ల పాటు తమ బీజేపీ, ఎన్సీపీ కూటమే మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ‘అంతా సవ్యంగానే సాగుతోంది. ఎవరూ ఆందోళ చెందాల్సిన పనిలేదు. కావాల్సిందల్లా కొంచెం ఓపిక పట్టడం మాత్రమే’ అని ట్వీట్ చేశారు.
I am in the NCP and shall always be in the NCP and @PawarSpeaks Saheb is our leader.
Our BJP-NCP alliance shall provide a stable Government in Maharashtra for the next five years which will work sincerely for the welfare of the State and its people.
— Ajit Pawar (@AjitPawarSpeaks) November 24, 2019
అంతకుముందు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అజిత్ పవార్ ట్వీట్ చేశారు. అలాగే 20 మంది బీజేపీ నేతలకూ ధన్యవాదాలు తెలిపారు. ‘గౌరవనీయులైన ప్రధాని మోదీ గారికి… మేం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడేలా చూస్తాం. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తన ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిప్యూటీ సీఎం’ ట్యాగ్ను యాడ్ చేసుకున్న పవార్.. ట్విట్టర్ కవర్ పేజీని సైతం మార్చేశారు. మహారాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని తన కవర్ పేజీగా పెట్టుకున్నారు.
Thank you Hon. Prime Minister @narendramodi ji. We will ensure a stable Government that will work hard for the welfare of the people of Maharashtra. https://t.co/3tT2fQKgPi
— Ajit Pawar (@AjitPawarSpeaks) November 24, 2019
మోదీని ఉద్దేశించి ట్వీట్ చేసిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తో బాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్ లకు, అలాగే మరికొంతమంది బీజేపీ మంత్రులు, నేతలకు కూడా అజిత్ పవార్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా శనివారం తెల్లవారు జామున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ కొత్తగా ఏర్పాటైన మహారాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందించారు.’సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్, అజిత్ లకు అభినందనలు. వారిద్దరు మహారాష్ట్రకు బంగారు భవిష్యత్ను అందిస్తారనే నమ్మకం నాకుంది. వారిద్దరూ కలిసి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సోషల్ మీడియాలో ఇద్దరికి శుభాకాంక్షలు అందజేశారు.
ఇదిఇలా ఉంటే.. పార్టీ అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న ఆయనను తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త శాసనసభా పక్ష నేతగా జయంత్ పాటిల్ ను ఎన్నుకున్నారు. ఇక బీజేపీ బలపరీక్షకు అజిత్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.