అమరావతి, ఏప్రిల్ 5: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలు 2014 ఎన్నికలకు ముందు తనను కరివేపాకులా వాడుకుని పక్కన బెట్టాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వారి విజయానికి నన్ను ముడి పదార్థంలా వాడుకున్నారు. నన్ను ఎదగనివ్వాలని వారు అనుకోలేదు’ అని అన్నారు. ఇక వారి కోసం నేనెందుకు పని చేయాలని పవన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో విజయం తరువాత నరేంద్ర మోదీని, బిజెపి నేతలను కలిసి మాట్లాడిన తరువాత నా అవసరం వారికి లేదనిపించిందని పవన్ అన్నారు. వారెవరూ ఈ మాట నాతో అనలేదుగానీ, అక్కడి పరిస్థితి మాత్రం అలా అనిపంచాయని పవన్ పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపిలు పవన్ కల్యాణ్ మద్దతు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో వైసిపి అధికారాన్ని కోల్పోయింది.
ఈ ఎన్నికల్లోనూ తమకు మద్దతివ్వాలని బిజెపి,వైసిపిలు తనను కోరాయనీ, అయినా తాను మాత్రం వారికి వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. దళిత శక్తిగా ఉన్న మాయావతితో ఈ దఫా పొత్తు పెట్టుకున్నామనీ, వామపక్షాలు తమతో కలిసివచ్చాయని పవన్ అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బిఎస్పి అధినేత్రి మాయావతి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.