న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోరింది. వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మనీలాండరింగ్ కేసులో వాద్రాకు నేరుగా సంబంధముందనే ఆరోపణలున్నాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కేసు విచారణలో వాద్రా తమకు సహకరించడం లేదని ఆరోపించింది. ఈ కేసులో చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం రాబట్టాల్సి ఉందని, కాబట్టి వాద్రాని కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని కోర్టును ఈడీ కోరింది.
అయితే ఈడీ చేసిన ఆరోపణలను రాబర్ట్ వాద్రా తరఫు న్యాయవాది ఖండించారు. వాద్రా విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సమన్లు జారీ చేసినప్పుడల్లా ఆయన ఈడీ ఎదుట హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఎలాంటి విచారణకైనా వాద్రా సిద్ధమని ఆయన తెలిపారు. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కక్ష సాధింపునకు పాల్పడటం సరికాదన్నారు. వాద్రా ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకపోవటం సహకరించనట్లు కాదని స్పష్టం చేశారు. వాదనల అనంతరం తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
లండన్లోని బ్రయస్టన్ స్క్వేర్లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తి కొనుగోలులో రాబర్ద్ వాద్రా మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను వాద్రా తోసిపుచ్చుతున్నారు.