(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కాబినెట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్కు చోటు ఇవ్వాలనుకోలేదని తనకు ఒక పుస్తకం ద్వారా తెలిసిందన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్తో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ట్విట్టర్లో తలపడ్డారు. ఇద్దరి మధ్యా ట్వీట్ల యుద్ధం నడిచింది. చివరికి గుహ తన వాదనకు మద్దతుగా నెహ్రూ స్వయంగా రాసిన ఒక లేఖను ట్వీట్ చేయడంతో జైశంకర్ మిన్నకుండిపోయారు.
ప్రముఖ సివిల్ సర్వెంట్ విపి మీనన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని విడుదల చేసిన జైశంకర్, ఆ తర్వాత, పటేల్కు నెహ్రూ మంత్రి పదవి ఇవ్వాలనుకోలేదని ఆ పుస్తకం ద్వారా తెలిసినట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దానికి స్పందించిన గుహ, ఈ అబద్ధపు ప్రచారాన్ని ప్రొఫెససర్ శ్రీనాధ్ రాఘవన్ గతంలో మట్టి కరిపించారు. ఇద్దరు నవ భారత నిర్మాతల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం విదేశాంగ మంత్రి పని కాదు. ఆ పనికి బిజెపి ఐటి విభాగం ఉంది అని ట్వీట్ చేశారు.
దీనికి జైశంకర్ చాలా తీవ్రంగా స్పందించారు. కొంతమంది విదేశాంగ మంత్రులు పుస్తకాలు కూడా చదువుతారు. ప్రొఫెసర్లు కూడా చదివితే మంచిది. నేను విడుదల చేసిన పుస్తకం చదవండి అని ఆయన ట్వీట్ చేశారు. దీనికి జవాబుగా గుహ, జెఎన్యు నుంచి పిహెచ్డి చేసి మీరు నాకంటే ఎక్కువే పుస్తకాలు చదివిఉంటారు. అయితే నెహ్రూ, పటేల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు పుస్తకంగా వచ్చింది. అది కూడా చదవండి. తన మంత్రిమండలిలో పటేల్ గట్టి మూలస్థంభమని నెహ్రూ రాసిన లేఖ అందులో ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల యుద్ధం గుహ ఆ లేఖను ట్వీట్ చేసేంతవరకూ సాగింది.