లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా రక్కసి ప్రభావం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ లు వస్తున్నాయి. కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా అందరినీ హడలెత్తిస్తోంది. ఎవరి ద్వారా కరోనా వైరస్ అంటుకుంటుందో తెలియక భయం భయంతో ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
నెల్లూరు, ఏలూరులో పోలీస్ శాఖను కరోనా హడలెత్తిస్తోంది. నెల్లూరులో ఏకంగా పోలీస్ స్టేషన్ నే మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ ఐ సహా ఏడుగురు కానిస్టేబుళ్ల తో పాటు పీఎస్ లో పనిచేసే స్వీపర్లకూ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోలీస్ స్టేషన్ ను మూసి వేశారు. ఓ హత్య కేసులో నిందితులను ఎలాంటి పరీక్షలు జరపకుండా స్టేషన్ తీసుకువచ్చి విచారించిన నేపథ్యంలోనే వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో అందరికీ కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులను కరోనా ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే విధంగా ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మరో 10 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వీరందరిని ఏలూరు ఆశ్రమ హాస్పటల్ లో ఐసోలేషన్ కి తరలించారు. దీనితో పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గత వారం రోజులుగా రాష్ట్రంలో నిత్యం ఏడు వందలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 17,699 మంది కరోనా బారిన పడగా 218 మంది మృతి చెందారు. 8008 మంది వైద్య సేవల అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.