అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని వెంకటాచలం ఎంపిడివో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేస్తే ఎవరైనా సరే ఒక్కటే అని ముఖ్యమంత్రి జగన్ డిజిపికి చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. కోటం రెడ్డిపై 448, 427, 290, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఏ1గా ఎమ్మెల్యే కోట్టంరెడ్డి, ఏ2గా శ్రీకాంత్ రెడ్డి పేర్లు చేర్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు శనివారం రాత్రి నుంచి ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఇంటిదగ్గర హైడ్రామా జరిగింది. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే ఇంటిదగ్గర పోలీసులు అయన కోసం వేచి చూశారు. ఆయన లేకపోవడంతో రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు. అయితే,ఆదివారం తెల్లవారుజామున కోటం రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో నిన్న జరిగిన పరిణామాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేవిలా వున్నాయని భావించి మొత్తం ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎవరైనా నేరం చేసినట్టు ఆధారాలు లభిస్తే, చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు తేల్చి చెప్పారు. ఆ వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీకి విషయాన్ని తెలిపిన సవాంగ్, కోటంరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఆపై భారీ బందోబస్తుతో నెల్లూరులోని కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా, ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోటంరెడ్డి నేరం చేసినట్టు ఆధారాలు పోలీసులకు లభించాయని తెలుస్తోంది. మరోవైపు కోటం రెడ్డి అరెస్టయ్యారన్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు రోడ్డెక్కడంతో నెల్లూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల లేఔట్ కు వాటర్ కనెక్షన్ ఇచ్చే విషయమై ఎంపీడీవో, కోటంరెడ్డి మధ్య వివాదం తలెత్తిందన్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ అపార్ట్మెంట్ పంచాయితీ పైప్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామ సచివాలయ పరీక్షల ఉన్నందువలన ఆయన దరఖాస్తుకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు ఆలస్యం అయ్యింది. దీంతో ఎమ్మెల్యే తనను బెదిరించారని ఎంపిడివో తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటిపైకి ఎమ్మెల్యే కోటం రెడ్డి అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారంటూ ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేసేందుకు గ్రామీణ పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలో ఒకరిద్దరు సిబ్బంది మినహా అధికారులెవరూ లేరు. దీంతో రాత్రి 11.30 నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె స్టేషన్ వద్దే బైఠాయించారు. ఉదయం 4 గంటలకు ఎస్సై రావడంతో ఫిర్యాదు ను అందజేశారు.