అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపిడిఒ సరళ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అదీ వరసకు బావా బావమరుదుల మద్య పంచాయతీగా వెల్లడి అవుతోంది. ఎంపిడిఒ ఫిర్యాదు చేయడం వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
ఎంపిడిఒ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే వెళ్లి కరెంటు వైర్లు కట్ చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. తాను ఆమె ఇంటికే వెళ్లలేదనీ, ఆ గ్రామంలో బహిరంగ చర్చకు సైతం సిద్ధమనీ కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన నాయకుడి వెంచర్కు సంబంధించి పైపులైన్ కనెక్షన్ కొరకు ఎంపిడిఒకు ఫోన్ చేసిన మాట వాస్తవమేననీ కోటంరెడ్డి చెప్పారు. అయితే నెల్లూరు జిల్లాలో నుడా, రెరా అనుమతులు ఉన్న ఏకైక లే అవుట్ అదేననీ దాని అనుమతుల కోసం తాను ఫోన్ చేయలేదనీ, అన్ని అనుమతులు ఉన్నందున మంచినీటి పైపులైన్ అనుమతుల కోసం తాను ఫోన్ చేయగా తమ ఎమ్మెల్యే ఆపమన్నారని ఎంపిడిఒ చెప్పిందన్నారు. దానిపై తాను మీ ఎమ్మెల్యేతో మాట్లాడతానని ఫోన్ పెట్టేశానని కోటంరెడ్డి అన్నారు. ఆ తరువాత తన బావే అయిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగినపుడు వేరే విషయం ఉందిలే తరువాత మాట్లాడదాం అని చెప్పారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోవర్థన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎంపిడిఒ పక్కనే ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించడం మీడియాలో వచ్చిందనీ, దీన్ని బట్టే ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో అర్థం అవుతుందనీ కోటంరెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన బావ బావమరుదుల ఈ పంచాయతీ చివరకు వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వద్దకు చేరే అవకాశం ఉంది.