(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య పోరుపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య సయోధ్య బాధ్యతను సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు సీఎం జగన్ అప్పగించారు. బుధవారం ముందుగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆయన నివాసంలో నెల్లూరు జిల్లా నేతలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కాకాణి గోవర్దన్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాణి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఈనెల 15న నెల్లూరులో జరగనున్న రైతు భరోసా కార్యక్రమంపైనా చర్చించారు.
అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో రైతు భరోసా క్రార్యక్రమం.. సీఎం సభపైన మాత్రమే మాట్లాడామన్నారు. సభను జయప్రదం చేయాలని కోరారన్నారు. అధికారి పెట్టిన కేసు అవాస్తవం అని గతంలోనే చెప్పానన్నారు. అయితే ప్రభుత్వ అధికారి ఫిర్యాదు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకున్నారని కోటంరెడ్డి చెప్పారు. కాకాణి స్వయాన తన మేనత్త కొడుకని చెప్పారు. ఈ నెల 16 నుంచి ఇక అమరావతిలోనే ఉంటానని చెప్పారు.
మరోవైపు తనకు, కోటంరెడ్డికి మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. కోటంరెడ్డి స్వయానా తన బావమరిది అని, చిన్నప్పటి నుంచి తాము ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని అన్నారు. ఒకవేళ తమ మధ్య ఏమైనా విభేదాలు వస్తే తామే పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం తమకు ఉందని చెప్పారు. కొందరు కావాలనే తమ మధ్య వివాదాలు సృష్టించాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉంటే.. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య తలెత్తిన విబేధాల వ్యవహారం చివరకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు చేరింది. జిల్లా నాయకుల తీరు.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఉన్నాయని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంకటాచలం ఎంపీడీవోను బెదిరించారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరినీ వదలపెట్టొద్దన్న సీఎం ఆదేశాలపై కోటంరెడ్డిని అరెస్టు చేయడం, అనంతరం బెయిల్ పై విడుదల కావడం జరిగాయి. అయితే ఈ పరిణామాలతో నెల్లూరు జిల్లా నాయకుల్లో విబేధాలు బయటకొచ్చాయి. తన మీద ఎంపీడీవో సరళ కేసు పెట్టడం వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి హస్తం ఉందని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి సర్వేపల్లి నియోజవకర్గంలోని వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కోటంరెడ్డి కోరుతున్నారు. అయితే, వాటర్ పైప్లైన్ అనుమతులు అక్కడి ఎమ్మెల్యే కాకాని అడ్డుకోవడం కోటంరెడ్డికి మింగుడు పడలేదు. తాను చెప్పినా పని జరగకపోవడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో పరిస్థితి కాకాణి వర్సెస్ కోటంరెడ్డిగా మారడంతో వీరి మధ్య వివాదాలు ముదిరి… అనుచరులు, అధికారులపై దాడులు వరకు వెళ్ళింది. ఎంపీడీవో సరళ ఇంటిపై కోటంరెడ్డి దౌర్జన్యం, తదనంతర పరిణామాలన్నీ కూడా రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇటువంటి జిల్లాలో నాయకుల విబేధాలు, నిత్యం వివాదాలు రావడం జగన్ కు, పార్టీకి ఆందోళనకరంగా మారాయి. ఎవరికి వారే అన్నట్లుగా సాగుతున్న ఎమ్మెల్యే వైఖరిపై జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 15న నెల్లూరులో రైతు భరోసా పథకం ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో జిల్లా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు పార్టీకి తలనొప్పిగా మారంది. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే పార్టీకి చెడ్డపేరు రావడంతో పాటు ప్రజల్లో నమ్మకం కోల్పోయే అవకాశాలున్నాయని గ్రహించిన జగన్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సయోధ్య బాధ్యతను వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని వైైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.