నేపాలీ షేర్పా ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని ఒకసారి అధిరోహించడమే కష్టం అనుకుంటే, నేపాల్కు చెందిన పర్వతారోహకుడు కామీ రీటా షేర్పా (49) ఏకంగా 23 సార్లు అధిరోహించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సాధారణంగా మార్చి నుంచి మే నెల వరకు ఎవరెస్ట్ పర్వతారోహణ జరుగుతుంది. నేపాల్ వైపు నుంచి కామీ రీటా షేర్పా ఈ శిఖరం ఎక్కాడు. షేర్పాలు సాధారణంగా చాలా బలంగా ఉండటంతో పాటు, బాగా ఎత్తులకు వెళ్లడంలో కూడా అనుభవం గడించి ఉంటారు. వీళ్లు విదేశీ పర్వతారోహకులకు హిమాలయాలు అధిరోహించడంలో సాయం చేస్తుంటారు. తాజాగా మంగళవారం నాడు కామీ రీటాతో పాటు మొత్తం ఎనిమిది మంది నేపాలీ షేర్పాలు ఎవరెస్ట్ పర్వతం పైకి ఎక్కారు. దీంతో ఇప్పటివరకు ఈ శిఖరాన్ని అత్యధిక సార్లు ఎక్కినవారిగా ఆయన పేరు నమోదైంది.
ఈ సంవత్సరం పర్వతం ఎక్కడం చాలా కష్టంగా ఉందని, దాంతో తాము చాలా ఆందోళనకు గురయ్యామని తాళ్లు కట్టే బాధ్యత తీసుకున్న హిమాలయన్ గైడ్స్ నేపాల్ సంస్థకు చెందిన ఈశ్వరీ పాడెల్ తెలిపారు. ఎట్టకేలకు వాతావరణం కొంత మెరుగుపడటంతో ఎనిమిది మందీ శిఖరాగ్రానికి చేరుకున్నారన్నారు. రాబోయే కొన్ని రోజుల్లో పర్వతారోహణకు చాలా బృందాలు సిద్ధమవుతున్నాయని ఆయన చెప్పారు. నేపాల్ ఈసారి రికార్డు సంఖ్యలో 378 మందికి అనుమతులు ఇచ్చింది. ఒక్కో పర్వతారోహకుడు రూ. 7.75 లక్షలు చెల్లించాలి. కానీ ఇంత ఎక్కువ మంది పర్వతాన్ని అధిరోహించడానికి వాతావరణం సహకరిస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుగా ఒక నేపాలీ గైడ్ వెళ్తుండగా అదే మార్గంలో మిగిలినవాళ్లంతా వెళ్లి 8,850 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు.
టిబెట్ మార్గం వైపు నుంచి శిఖరం మీదకు వెళ్లేందుకు మరో 140 మంది కూడా ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి మే చివరి వరకు వాతావరణం అనుకూలించడంతో ఈ మార్గంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ అధిరోహణకు ఆసక్తి చూపుతుంటారు. గత సంవత్సరం రికార్డు సంఖ్యలో 807 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వారిలో దక్షిణం వైపు నుంచి 563 మంది, ఉత్తరం వైపు నుంచి 244 మంది ఉన్నారు. పర్వతారోహణలో భాగంగా ఐదుగురు మరణించారు. వారిలో ఒక అనుభవజ్ఞుడైన షేర్పా కూడా ఉన్నారు.