(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల విషయంలో ఎన్నికల కమిషన్పై వత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. వీవిప్యాట్ స్లిప్పుల లెక్కతో ఇవిఎం కౌంటింగ్ సరిపోలని పక్షంలో మొత్తం అన్ని కేంద్రాలలోని వివిప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం అవసరమైతే ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని భావిస్తున్నారు.
ఇక, అటు కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎకూ, ఇటు బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎకూ సమదూరం పాటిస్తున్న తటస్థ పార్టీల లెక్కలు వేరుగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి సమీక్షించి ఎవరికి మద్దతిచ్చేదీ అప్పుడు నిర్ణయించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ తటస్థ పార్టీలలో ఆంధ్రప్రదేశ్లోని వైసిపి, తెలంగాణలోని టిఆర్ఎస్, ఒదిషాలోని బిజూజనతాదళ్ ముఖ్యమైనవి. వీటిలో తెలంగాణ, ఒదిషా పార్టీలు అధికారపక్షాలు కాగా ఆంధ్రప్రదేశ్లోని వైసిపి ఈసారి అధికారంలోకి రాగలనని విశ్వసిస్తున్నది.
ఈ మూడు పార్టీలలో టిఆర్ఎస్ 13 నుంచి 15 వరకూ లోక్సభ సీట్లు గెలుచుకోగలదని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ఫలితాల తర్వాత పరిస్థితి సానుకూలంగా ఉంటే బిజెపిని శాసించడం కూడా కుదరవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు.
ఒదిషాలోని 21 సీట్లలో బిజూజనతాదళ్కు సగం వరకూ సీట్లు వస్తాయని అంచనా. అక్కడ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు మూడింట రెండు వంతుల లోక్సభ సీట్లు సాధిస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో అధికారపక్షానికి బిజిపినే ప్రధాన ప్రత్యర్ది. ఒదిషా ప్రయోజనాలను కాపాడే పార్టీకి కేంద్రంలో తాము మద్దతు ఇస్తామని గతంలోనే నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రెండు ఎగ్జిట్ పోల్స్ మినహా అన్నీ కూడా వై.ఎస్.జగన్ నాయకత్వంలోని వైసిపి రాష్ట్రాధికారాన్ని చేపట్టడంతోపాటు 17 నుంచి 24 వరకూ లోక్సభ సీట్లు గెలుచుకోగలదని అంచనా వేశాయి. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకటి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న టిడిపి నేత చంద్రబాబు, అవసరమైతే జగన్నూ, కెసిఆర్నూ కూడా ఆహ్వానించాలని అన్నట్లు వినబడుతోంది. అయితే వైసిపి ముందు నుంచీ బిజెపి పట్ల ఎంతోకొంత సానుకూల వైఖరి చూపుతూ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ నేపధ్యంలో ఆ పార్టీ కూడా వేచిచూడాలన్న ఆలోచనలో ఉంది.