గుంటూరు: జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సభ్యులను టిడిపి బృందం కలిసి జిల్లాలో జరిగిన పరిస్థితులను వివరించింది. ఎంపి గల్లా జయదేవ్, నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, అశోక్బాబు, మద్దాలి గిరి తదితరులు కమిషన్ సభ్యులను కలిసి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించడంతో పాటు వైసిపి దాడులకు సంబంధించి పలు అధారాలను కమిషన్ సభ్యులకు అందజేశారు.ముందుగా కమిషన్ సభ్యులు ముఖేశ్, లాల్ బాహర్, అరుణ్ కుమార్, మల్లయ్యలతో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఎస్పి విజయరావు భేటీ అయ్యారు.
ఎన్నికల ఫలితాల అనంతరం గుంటురు జిల్లా పల్నాడు ప్రాంతంలో టిడిపి వర్గీయులపై దాడులు, కేసుల నమోదు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసులు నమోదు చేయడం, ఆయన ఆత్మహత్య, పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా వైసిపి వారు గోడ నిర్మించడం తదితర విషయాలను ఉదహరిస్తూ గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఢిల్లీ వెళ్లి టిడిపి ఎంపిలతో జాతీయ మానవహక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదును పురస్కరించుకొని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం జిల్లాకు వచ్చింది. నేటి నుండి నాలుగు రోజుల పాటు జిల్లాలో ఈ బృందం పర్యటించనున్నది.
పొనుగుపాడు,ఆత్మకూరు,పిన్నెల్లి గ్రామాలలో ఈ బృందం పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నది. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో టిడిపి వర్గీయులు ఇళ్లకు వెళ్లకుండా రోడ్డుపై వైసిపి వర్గీయులు గోడ నిర్మించగా నాలుగు నెలలుగా ఈ వివాదం నడుస్తున్నది. ఈ వివాదంపై శాసనమండలిలో నెల రోజుల్లో గోడను తొలగించి సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు.
ఈ పరిస్థితుల్లో జాతీయ మానవహక్కుల కమిషన్ బృందంలో క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.