అమరావతి: అసెంబ్లీలో రాజధానిపై జరుగుతున్న చర్చలో సభకు అడ్డుతగులుతున్నారన్న అభియోగంపై తొమ్మిది మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రతిపాదనపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, వీరాంజనేయ స్వామి, మద్దాల గిరి, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం ఆశోక్లను స్పీకర్ నేటి సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గత టిడిపి హయాంలో రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవమనీ బుగ్గన అన్నారు. టిడిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో నాలుగు వేల ఎకరాలకు పైగా టిడిపి నేతలు కొనుగోలు చేశారని బుగ్గన వివరించారు. భారీగా భూములు కొనుగోలు చేసిన వారు స్థానికులు కాదని ఆయన పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే భూములు ఎలా కొన్నారు అని బుగ్గన ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో ఎవరెవరు భూములు కొనుగోలు చేశారు అన్న వారి పేర్లను బుగ్గన చదివి వినిపించారు. ఈ వివరాలు వెల్లడిస్తున్న సమయంలో టిడిపి సభ్యులు నినాదాలు చేస్తుండటంతో వారిని సస్పెండ్ చేయాలని బుగ్గన కోరారు.
previous post
next post