న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దోషి అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే అన్ని విచారణలు పూర్తయినందున తీర్పును మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసం అభిప్రాయపడింది. ఈ పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే మంగళవారం తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం.. దోషులపై ఎలాంటి దయ అక్కర్లేదని అభిప్రాయపడింది.
ఇదే పిటిషన్ లో నిర్భయ తల్లి కూడా ఇంప్లీడ్ అయ్యారు. దీంతో తమ వాదనలు వినిపించేందుకు నిర్భయ తల్లిదండ్రులు కూడా న్యాయస్థానంలో హాజరయ్యారు. తొలుత అక్షయ్ సింగ్ తరుపున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. మీడియా, రాజకీయ నాయకులు, ప్రజల ఒత్తిడి వల్ల తమ క్లయింట్ ను దోషిగా తేల్చారని అన్నారు. అక్షయ్ అమాయకుడని, పేద వ్యక్తి అని అందుకే అతన్ని కేసులో ఇరికించారని వాదించారు. తన క్లయింట్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. నిర్భయ మరణ వాంగ్మూలంలో అనుమానాలున్నాయని అన్నారు. చనిపోయే ముందు నిర్భయ ఇచ్చిన వాంగ్మూలంలో అక్షయ్ పేరు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. మరణ శిక్ష అనేది మానవ హక్కులకు వ్యతిరేకమని వాదించారు.
అక్షయ్ రివ్యూ పిటిషన్ ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. కొన్ని నేరాలు మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోతాయని అన్నారు. ఈ కేసులో దోషి అక్షయ్ కి సానుభూమి పొందే అర్హత లేదన్నారు. ఈ కేసులో శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఉరి శిక్ష విధిస్తూ.. 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా ఎలాగో నా ఆయుష్షు తగ్గిపోతోంది. కాబట్టి తనకు మరణశిక్ష విధించొద్దని అక్షయ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో మిగతా ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జులై 9న సర్వోన్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించింది.
డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా… వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదల అయ్యాడు. మిగతా నలుగురూ తీహార్ జైల్లో ఉన్నారు. వాళ్లు క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో శిక్ష అమలు కాలేదు. ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్… క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించారు. తాజా సుప్రీం కోర్టు కూడా అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ ను కొట్టివేయడంతో.. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి శిక్ష అమలు చేయనున్నారు.