న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ చేశాడు. తీహార్ జైల్లో తనపై అత్యాచారం జరిందని సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశాడు. తనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముఖేశ్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముఖేశ్.. తనపై తీహార్ జైలులో అత్యాచారం జరిగిందని, సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు. జైలు అధికారుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ మేరకు అతని న్యాయవాది అంజనా ప్రకాశ్ వెల్లడించారు. అయితే ముఖేశ్ వాదనను సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. అతనిపై అత్యాచారం జరిగినా, దానికీ, క్షమాభిక్షకు సంబంధం లేదని అన్నారు.
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితుల క్యురేటివ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కొట్టేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరైన ముఖేశ్ దాఖలు చేసిన క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. దాన్ని సవాల్ చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేశాడు.
నిర్భయ కేసులో పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్కు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు మరోసారి ట్రయల్స్ నిర్వహించారు. అయితే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు అనేక రకాలుగా న్యాయమార్గాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. దీంతో ఫిబ్రవరి 1న వారికి మరణశిక్ష అమలవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్గా మారింది.