న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ శనివారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తీరస్కరించడంపై రివ్యూ పిటిషన్ వేశాడు. నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ కుమార్ సింగ్ (32) పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జనవరి 17న తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో కేసులోని నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీన తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. అయితే, ఉరితీతను వీలైనన్ని రోజులు వాయిదా వేయించేందుకు దోషులు కోర్టుల్లో ఏదో ఒక పిటిషన్ వేస్తూనే ఉన్నారు.
ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేశామని ముఖేశ్ సింగ్ తరపు న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. శత్రుఘ్న చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా… రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంపై జ్యూడీషియల్ రివ్యూ కోరామని చెప్పారు.
ఇప్పటికే ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ డెత్ వారంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.
దోషులకు ఉరితీయనున్న నేపథ్యంలో చివరి కోరికపై వారు మౌనం వహించారు. ఉరిశిక్ష అమలు దగ్గర పడుతుండటంతో జనవరి 22న చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా? అని అధికారులు దోషులను అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిబంధనల ప్రకారం మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని లేదా తమ ఆస్తిని ఎవరికైనా వదిలేయాలనుకుంటున్నారా? అని కూడా అడుగుతారు. అయితే ఈ రెండు విషయాలపై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. నిందితులు ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలు మౌనంగా ఉన్నారు. ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోందని జైలు అధికారులు పేర్కొన్నారు.
నిజానికి జనవరి 22 ఈ నలుగురు దోషులను ఉరిశీయాల్సి ఉండగా.. క్షమాభిక్ష అభ్యర్థన కారణంగా ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకడైన ముఖేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోవడంతో వీరి శిక్ష అమలు తేదీ వాయిదా పడింది. ముఖేశ్ అభ్యర్థననను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో ఢిల్లీ కోర్టు ఇటీవలే కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషులను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది.