న్యూఢిల్లీ: లోక్సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె.. మాజీ ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీని గుర్తు చేసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉందని కొనియాడారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో కోరుకున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి తామంతా పని చేస్తున్నామని చెప్పారు.
దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో బడ్జెట్ ను తీసుకొచ్చామన్నారు. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని, కేంద్ర ఖజానాకు చేరుతున్న ఆ నిధులన్నీ, తిరిగి సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సరకు రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంమన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం భవిష్యత్త వృద్ధికి సంకేతమని నిర్మల అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ర్టాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు వెలుతుందని చెప్పారు. జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొందని తెలిపారు. జీఎస్టీ అమలు తరువాత సామాన్యులకు నెలవారి ఖర్చు నాలుగు శాతం ఆదా అయిందని వెల్లడించారు.