ఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ కార్లను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అలాంటి చర్యలేవీ ఉండవని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు ఇంధనంపై ఉన్న పన్నుల తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్థికమంత్రిని కోరనున్నట్లు నితిన్ చెప్పారు. ఆర్థిక మాంద్యం వల్ల ఆటో పరిశ్రమలకు ఇబ్బందులు వచ్చాయన్నారు. ఎగుమతుల్లో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భారత్ లో ఆటోమొబైల్ రంగంలో రూ.4.50 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని చెప్పారు. ఈ రంగంలో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం మాంద్యం దెబ్బతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. ఆర్థికశాఖ దీనికి పరిష్కారం కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం ముడిచమురు దిగుమతుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటోందని, ఇక కాలుష్యం, రహదారుల భద్రతలోనూ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దేశంలో రూ 4.50 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్ రంగం పరిశుభ్ర ఇంధనం వైపు మళ్లాలని పిలుపుఇచ్చారు. కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం ప్రజల్లో అనారోగ్య సమస్యలను వ్యాప్తి చేస్తోందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిఇలా ఉంటే..విపరీతంగా పెరిగిపోయిన వాతావరణ కాలుష్యంతో మానవాళి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్నది. వాహనాల వాడకం రోజురోజుకూ పెరిగిపోవడంతో వాయు కాలుష్యానికి దారితీస్తుంది. అయితే, డీజిల్, పెట్రోల్ ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వాహనాలను వినియోగిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాలు కనుమరుగయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.