న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో చిదంబరం సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో చిదంబరం ఆధారాలను తారుమారు చేసే అవకాశం లేకపోయినా.. సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. న్యాయస్థానం ఆయనకు అక్టోబరు 3వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. సాధారణ బెయిల్ పిటిషన్ తోపాటు తనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం మరో పిటిషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిఇలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. అయితే బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ప్రత్యేక కోర్టు చిదంబరంకు బెయిల్ మంజూరు చేయలేదు.
చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. మొత్తం రూ.305కోట్ల అవినీతి జరిగిందని 2017 మే 15న ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.