కరోనా వ్యాక్సిన్ ఐసిఎంఆర్ అత్యుత్సాహం ప్రదర్శించిందా..? కరోనాను దేశం నుంచి తరిమి కొట్టే ప్రయత్నంలో రాజకీయాలకు లొంగిందా..? వత్తిళ్లకు తలొగ్గి అస్పష్టమైన ప్రకటనలు చేసిందా..? భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాక్సీన్ కరోనా విషయంలో ఐసీఎంఆర్ తప్పటడుగులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు జరిగిన ఒక సంఘటన తో ఐసీఎంఆర్ అడ్డంగా బుక్కయింది. ఇదిగో ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అంటూ ప్రకటన విడుదల చేసేసి ఆ తర్వాత అస్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ప్రతినిధులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పిన సమాధానంతో అడ్డంగా బుక్కయ్యారు. అదేంటో చూద్దాం పదండి.
వ్యాక్సిన్ కు ఏడాది ఆగాల్సిందే..!
మొదటి నుండి శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నట్లు కరోనా వ్యాక్సిన్ కి కనీసం ఏడాదిన్నర లేదా ఏడాది సమయం పడుతుంది. అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రముఖ శాస్త్రవేత్తలు అంగీకరించిన విషయం. కానీ మే నెల చివరి వారంలో భారత్ బయోటెక్ అనే సంస్థ ప్రయోగాలు ప్రారంభించడం, జూన్ నాటికి అది సక్సెస్ అవ్వడం, జూలై నాటికి ఐ సీ ఎంఆర్ ఆమోదించేయడం, ఆగష్టు 15 కల్లా రిలీజ్ చేయాలని ఒక ఆర్డర్ వేసెయ్యడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. దీని వెనక రాజకీయ ఒత్తిళ్లే ఉన్నాయో, ప్రధాన మంత్రి మోడీ ఉన్నారో, కేంద్ర ప్రభుత్వమే ఉందో, ఏముందనేది విషయాన్ని పక్కన పెడితే.. ప్రపంచమంతా నివ్వెర పోయింది. తాజాగా ఈ విషయంపై వచ్చిన స్పష్టత ఏమిటంటే..పార్లమెంటరీ స్థాయి సంఘం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కరోనా వ్యాక్సిన్ విషయమై అధికారులు ప్రశ్నించింది. వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వగలరు? దానికి సంబంధించిన వివరాలు ఏమిటని ప్రశ్నించింది. అనే విషయాలు దానికి సంబంధించిన వివరాలు ఏమిటని ప్రశ్నించగా.. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు కొందరు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే వారు చెప్పిన సమాధానంలో ఏడాది వరకూ అంటే మరో 12 నెలల వరకు కరోనా వ్యాక్సిన్ విడుదల కాదు అని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఐసీఎంఆర్ అడ్డంగా బుక్కయినట్లేకదా?. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తామని, ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రకటించిన ఐసీఎంఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారుల సమాధానంతో ఏం సమాధానం చెబుతుంది. ప్రజల బాగోగులు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా శాస్త్రీయ తరహాలో అన్ని కీలక అంశాలను పరిశీలించుకొని ప్రకటనలు చేయాల్సిన ఐసీఎంఆర్ అస్పష్టంగా, అపరిశోధకంగా ఇటువంటి ప్రకటనలు చేసిన కారణంగా కొంత అపవాదు మూటగట్టుకుంది. మొత్తానికి 2021 జూలై వరకు మాత్రం కరోనాకు వ్యాక్సిన్ రాదు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది.