రెండో దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో గురువారం పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓటు వేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్త వచ్చింది. దానికి సంబంధించి ఓ ఫొటో కూడా జత చేశారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఓటు కోసమే పని గట్టుకుని భారతదేశం వచ్చారని, ఓటు వేసి వెళ్లిపోయారన్నది ఆ వార్త సారాంశం. ఓటు వేయడానికి వస్తున్న సుందర్ పిచాయ్ అంటూ ఫొటో కూడా పెట్టారు. 22 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్న ‘ద కన్ ఫ్యూజ్డ్ ఇండియన్’ అనే వెరిఫై అయిన ఫేస్ బుక్ పేజీలో కూడా ఇది వచ్చింది.
మరికొన్ని వ్యక్తిగత ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాలు కూడా వెంటవెంటనే దాదాపు ఇదే సారాంశంతో ఆ ఫొటోను షేర్ చేశాయి. పూర్ గయ్ సేయింగ్స్, హలో దుబాయ్ ఆ? అనే పేజీలలో కూడా పిచాయ్ ఓటేయడానికి భారతదేశం వచ్చినట్లు ఫొటోలు పెట్టారు. అయితే, వీటన్నింటికంటే బాగా ముందు దళపతి బాషా ఓటీఎఫ్ సీ అనే యూజర్ చేసిన ట్వీట్ ద్వారా ‘ఆల్ట్ న్యూస్’ అసలు విషయం కనిపెట్టింది.
పాత ఫొటోకు కొత్త కథ
గూగుల్ లో ఇమేజి రివర్స్ సెర్చ్ చేసినపుడు అసలు విషయం తెలిసింది. ఆ ఫొటో 2017 నాటిది. అప్పట్లో భారత దేశం వచ్చిన సుందర్ తాను చదువుకున్న ఖరగ్పూర్ ఐఐటీకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోను ఇప్పటి వార్తతో కలిపి పెట్టేశారు. దాన్ని చూసిన వారు నిజంగా పిచాయ్ ఓటు వేయడానికి వచ్చారని నమ్మేశారు. స్వయంగా పిచాయ్ 2017 జనవరి 7న తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఆ ఫొటోను ట్వీట్ చేశారు.
Also got to visit my alma mater (and old dorm room!) for the first time in 23 years. Thanks to everyone @IITKgp for the warm welcome! pic.twitter.com/OUn7mlKGI7
— Sundar Pichai (@sundarpichai) January 7, 2017
అమెరికాలో ఉంటున్న ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. అంటే ఆయన భారత పౌరుడిగా, అమెరికా పౌరుడిగా కూడా చెలామణి అవుతున్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి సుందర్ పిచయ్ ఓటు వేశారనడం నిజం కాదు.