హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘ఛలో ట్యాంక్బండ్’ కార్యక్రమంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా.. శనివారం(నవబంర్ 9) ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నారు. అయితే, ‘ఛలో ట్యాంక్ బండ్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శనివారం ట్యాంక్ బండ్పైకి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామని సీపీ అంజన్ కుమార్ స్పష్టం చేశారు. ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. మిలియన్ మార్చ్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆర్టీసీ జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ముందస్తు అరెస్టులను ఆర్టీసీ జేఏసీ, వామపక్ష పార్టీలు ఖండించాయి. పోలీసులు అడ్డుకున్నా.. ఛలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశాయి.
శనివారం నాటి ఛలో ట్యాంక్బండ్ను.. మరో మిలియన్ మార్చ్గా మార్చేందుకు ఆర్టీసీ జేఏసీ కసరత్తు చేస్తోంది. దీనికి విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మికులు కుటుంబ సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఛలో ట్యాంక్బ్యాండ్కు తరలి రావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనేలా ఆర్టీసీ జేఏసీ నేతలు వారితో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 35వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకూ.. సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఛలో ట్యాంక్ బండ్కు పోలీసులు అనుమతి నిరాకరించడం.. ఖచ్చితంగా నిర్వహిస్తామని జేఏసీ స్పష్టం చేయడంతో.. శనివారం ఏం జరగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ‘మిలియన్ మార్చ్’ ది ఓ ప్రత్యేక స్థానం. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచమొత్తానికి చాటిచెప్పిన అపూర్వ సందర్భం అది. 2011 మార్చి 10 న మిలియన్ మార్చ్ కు అప్పటి రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. మార్చ్ ను పూర్తిస్థాయిలో అణగదొక్కాలని నాటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జిల్లాల్లో నేతల నిర్భందం, పారా మిలిటరీ దళాల పహారా, బ్యారికేడ్లు, ఇనుపకంచెలు ఏవీ ఉద్యకారులను ఆపలేకపోయయి. ఇంటలిజెన్స్ కూడా కనిపెట్టలేనంత పక్కాగా తెలంగాణ వాదులు ఆ రోజు ట్యాంక్ బండ్ కు అనూహ్యంగా చేరుకున్నారు. ఉప్పెనలా వచ్చిన ఉద్యమకారులను ఆపే సహాసం పోలీసులు కూడా చేయలేకపోయారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మార్చ్ ను అణగదొక్కాలని కుతంత్రాలు చేయడంతో ఉద్యమకారులు ట్యాంక్ బండ్ పై రెచ్చిపోయారు. ఉద్యమకారులను అరెస్టు చేయడం, మార్చ్ ను అడ్డుకోవడాన్ని సహింలేక కొందరు ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలపై ప్రతాపం చూపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ కార్యక్రమం..స్ఫూర్తితో ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి ప్లాన్ చేసింది. అయితే, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మినియన్ మార్చ్ మరోసారి పునరావృతం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.