ఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీపై ఊహాగానాలకు తెరపడింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసి లోక్సభ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ మరోసారి అజయ్ రాయ్కే కేటాయించింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
కొన్ని నెలల క్రితమే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవితో పాటు, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార భాద్యతను కూడా అప్పగించింది. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రియాంక పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘రాయ్బరేలినే ఎందుకు వారణాసి నుంచి పోటీ చేయకూడదా’ అని రాహుల్ సమాధానమిచ్చారు. దీంతో ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదిపై పోటీ చేయనున్నదని వార్తలు వచ్చాయి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ‘ ప్రియాంక వారణాసిలో పోటీ చేయటానికి అంగీకరించింది. తుది నిర్ణయం పార్టీదే’ అని చెప్పటంతో ఆమె పోటీపై ఆసక్తి నెలకొన్నది.
అలాగే ప్రియాంక గాంధీ కూడా పార్టీ అధిష్ఠానం చెప్పిన చోటు నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి అజయ్ రాయ్కే అవకాశం కల్పించింది.
2014లో వారణాసిలో ప్రధాని మోది మీద అజయ్ రాయ్తో పాటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పోటీ చేశారు. మోదికి 5.8 లక్ష ఓట్లు నమోదవ్వగా 3.7 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కేజ్రీవాల్ రెండు లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలవగా.. అజయ్ రాయ్ 75 వేల ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.