‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓడిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నట్లుగా ఏబీపీ న్యూస్ స్క్రీన్ షాట్ పెట్టి ఇండియా రెసిస్ట్స్ అనే ఫేస్ బుక్ పేజీలో ప్రచారం జరిగింది. ఆ చానల్ ప్రసారం చేసిన ఆమె విలేకరుల సమావేశం తాలూకు చిత్రాన్ని తీసుకుని దాంతో ఈ పోస్ట్ పెట్టి దాన్ని విపరీతంగా వైరల్ చేశారు. దాతో అది ఆ చానల్ పరువు ప్రతిష్ఠలకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.
జర్నలిస్టు నుంచి సినిమా దర్శకుడిగా మారిన అవినాష్ దాస్ కూడా దాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియా యూజర్లు అదంతా నిజమేనని భావించారు.
ये सच्ची ख़बर है या फोटोशॉप है? कोई कंफर्म करे, प्लीज! pic.twitter.com/j2UdYUKeUy
— Avinash Das (@avinashonly) April 22, 2019
వాస్తవం ఇదీ..
స్మృతి ఇరానీ అలా అన్నారా అన్న విషయాన్ని కీవర్డుల ద్వారా గూగుల్ లో సెర్చ్ చేస్తే అలాంటిదేమీ రాలేదు. స్మృతి ఇరానీ అసలు ప్రధానమంత్రి విషయంలో ఏం అన్నారని మరింత గాలించగా, ‘‘ప్రధాన సేవకుడైన నరేంద్ర మోదీ రిటైర్ అవ్వాలని ఏ రోజు నిర్ణయించుకుంటారో, నేను కూడా అదేరోజు భారత రాజకీయాలను వదిలేస్తాను’’ అని మాత్రమే ఆమె అన్నారు. మరి ఏబీపీ న్యూస్ విషయం ఏంటని ఆల్ట్ న్యూస్ ప్రతినిధులు ఆ చానల్ సీనియర్ ఎడిటర్ పంకజ్ ఝాను అడిగినప్పుడు, అది మార్ఫింగ్ చేసిన స్క్రీన్ షాట్ అని ఆయన నిర్ధరించారు.
అంతేకాదు, స్మృతి ఇరానీ మాట్లాడినపుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారని భావిస్తున్న ఆమె ప్రెస్ మీట్ వీడియో కూడా దొరికింది. ఆ విలేకరుల సమావేశంలో ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల మీద ఆరోపణలు చేశారు. వాళ్లంతా ఒక భూమి కుంభకోణంలో ఉన్నారని మాత్రమే చెప్పారు.
గతంలో కూడా ఇలాగే ప్రముఖ టీవీ చానళ్లకు సంబంధించిన స్క్రీన్ షాటలు తీసుకుని, వాటిమీద తమకు తోచిన రాతలు రాసేసి సోషల్ మీడియాలో పెట్టడం కనిపించింది. తాము అనుకున్న విషయాన్నే మీడియా కూడా ప్రసారం చేస్తోందని నమ్మించడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారు.