న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్లపై జనవరి రెండో వారంలోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి.చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్లతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది.
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్, ఢిల్లీల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పలు యూనివర్శిటీల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, జమియా మిలియా, లక్నో, జేఎన్యూలలో విద్యార్థులు ఆందోళన చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో పోలీసులపై రాళ్లురువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు.
మరోవైపు ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ(ఎం), ఎంఐఎం, టీఆర్ఎస్ తదితర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇదిఇలా ఉంటే.. మోదీ ప్రభుత్వం సీఏఏ అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోని హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్ పౌరసత్వం కల్పిస్తుందన్నారు. ఈ విషయంలో మోదీ సర్కారు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
భారత్కు పొరుగున ఉన్న పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్.. ఇస్లామిక్ దేశాలు. ఈ మూడు దేశాల్లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శీలు మైనార్టీలు. ఈ మూడు దేశాల్లో హింసకు గురైన ముస్లిమేతరులు మన దేశానికి శరణార్థులుగా వచ్చారు. అలాంటి వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. గతంలో భారత్లో 11 ఏళ్లుగా శరణార్థులుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 9న లోక్ సభలో ఆమోదం పొందగా.. 11న రాజ్యసభలో ఆమోదం పొందింది. మరునాడే రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో సవాల్ చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.