న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 5 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా..చిదంబరం వయస్సు ఇప్పుడు 74ఏళ్లు అని, అందుకే ఆయనను తీహార్ జైలుకు తరలించవద్దని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. చిదంబరంను జైలుకు పంపకుండా గృహనిర్బంధంలోగాని, సీబీఐ కస్టడీలోగాని ఉంచాలని సుప్రీంకోర్టును కోరారు.
మరోవైపు చిదంబరానికి కోర్టు విధించిన సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆయన కస్టడీ పొడిగించాలని, ఆయనకు ఎటువంటి రక్షణ కల్పించవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆయనను వదిలితే తప్పించుకునే అవకాశం ఉందని, విచారణకు సహకరించక పోవచ్చునని విన్నవించింది. చిదంబరంను ఎక్కడ విచారించాలన్న విషయాన్ని సీబీఐ కోర్టు తేలుస్తుందని సీబీఐ వాదనలు వినిపించింది. జస్టిస్ భానుమతి, జస్టిస్ బొపన్నలతో కూడిన ధర్మాసనం ఇద్దరి వాదనలు వింది. అనంతరం గురువారం వరకు చిదంబరం కస్టడీని పొడిగించింది. కాగా, గత 11 రోజులుగా చిందబరం సీబీఐ కస్టడీలోనే ఉన్నారు.