(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న నిత్యానంద పరమశివుడట. ఆ మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. దానికన్నా విచిత్రం ఏమంటే ఆయన ఆ మాటలు చెబితే వినేవాళ్లు ఉన్నారు.
నిత్యానంద తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఒ క వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నది. నన్నెవరూ ముట్టకోలేరు. ఏ పనికిమాలిన కోర్టూ నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు అని అందులో నిత్యానంద అంటాడు. ఇది ఎక్కడ తీసిందీ తెలియదు.
https://twitter.com/YippeekiYay_DH/status/1197818470349463552?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1197818470349463552&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fnithyananda-rape-accused-in-viral-video-now-nobody-can-touch-me-2144585
కిడ్నాప్, బాలికలను అక్రమంగా నిర్బంధించడం అన్న అభియోగాలపై గుజరాత్ పోలీసులు నిత్యానంద కోసం వెదుకుతున్నారు. అయితే నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశాడు. అతను ఈక్వెడార్ దేశం నుంచి ఒక దీవి కొనుగోలు చేసి అందులో కైలాశ్ అనే రాజ్యం స్థాపించాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని అటు ఈక్వాడార్, ఇటు భారత విదేశీ వ్యవహారాల శాఖ అంటున్నాయి.
అయితే నిత్యానంద ఒక చోట సముద్రం ఒడ్డున తన శిష్యులతో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో తిరుగుతున్నాయి. అది దీవి అయిందీ లేనిదీ ఆ ఫొటోల ద్వారా నిర్ధారించలేం.
నిత్యానందపై ఇండియాలో చాలా కేసులు ఉన్నాయని తెలియగానే అతనికి ఆశ్రయం నిరాకరించామని ఈక్వెడార్ ప్రకటించింది. మరోపక్క ఇండియా అతని పాస్పోర్టు రద్దు చేసింది. అతను కరీబియన్ దీవుల్లో ఒకటైన హైతీకి వెళ్లిఉండవచ్చని ఈక్వెడార్ తెలిపింది. నిత్యానంద ఒక దీవిలో రాజ్యం స్థాపించాడన్న వార్తలను విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఈసడించారు. రాజ్యం స్థాపించడం అంటే వెబ్సైట్ స్థాపించడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిత్యానంద రాజ్యం కబుర్లు అతనే తన వెబ్సైట్ ద్వారా చలామణీ లోకి తెచ్చినవి తప్ప వాటిల్లో నిజం లేదని ఆయన అన్నారు. నిత్యానంద ప్రస్తుతం ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు.