ఢిల్లీ: కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చాక కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నోయిడాలో ఓ బస్సు డ్రైవర్కు హెల్మెట్ లేదని రూ.500 జరిమానా విధించారు. నోయిడాకు చెందిన నిరంకర్ సింగ్ అనే ట్రాన్స్ పోర్ట్ కంపెనీ యజమానికి 50 బస్సులు ఉన్నాయి. స్కూళ్లు, పలు ప్రైవేటు కంపెనీలకు బస్సులను అద్దెకు ఇస్తుంటారు. అందులో ఓ స్కూల్ బస్సుకు.. డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని రూ.500 జరిమానా విధించారని నిరంకర్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్ 11న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఈ చలానా రాసినట్లు బాధితుడు తెలిపారు. గతంలోనూ ఏం తప్పిదం చేశామో తెలపకుండా ఒకే రోజు ఒకే బస్సుకు మూడు చలాన్లు విధించారని వివరించారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని బాధితుడు చెప్పారు.
అయితే, ఆన్లైన్లో నమోదు చేయడంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. త్వరలో సరిచేసిన జరిమానా యజమానికి పంపుతామని వెల్లడించారు. అయితే, సదరు బస్సు యజమాని నాలుగు పెండింగ్ చలాన్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గతంలో సీట్ బెల్డ్ పెట్టుకోలేదని చలాన్ విధించినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా.. మరిన్ని రాష్ట్రాల్లో పెనాల్టీల విషయంలో స్వల్ప మార్పులు తెచ్చాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్తున్నాయి. కొత్త వెహికిల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత భువనేశ్వర్ కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కి ట్రాఫిక్ ఉల్లంఘన కింద రూ.47,500 జరిమానా విధించారు. రాజస్థాన్ లో ఓవర్ లోడ్ చేసినందుకు ఓ లారీ యజమానికి ఏకంగా రూ.1,41,000 జరిమానా విధించారు. బైక్ పై విధించిన చలాన్ చూడి ఢిల్లీలో ఓ వ్యక్తి ఏకంగా తన బైక్ను నడిరోడ్డుపై తగలబెట్టేశాడు. గుజజాత్ లో జరిమానాలను తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ ఇటీవల ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాకట, మహారాష్ట్ర, గోవాలో కూడా చలాన్లపై జరిమానాలు తగ్గించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. బీజేపీయేతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీలోనూ ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నాయి.