(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వామపక్షాల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ ఎన్నికలలో సిపిఐ (మార్క్సిస్టు), సిపిఐ కలిపి అయిదు మాత్రమే లోక్సభ సీట్లు గెలుచుకోగలిగాయి. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇంత కనిష్ట స్థాయి ఎప్పుడూ లేదు. కేరళలో ఒక్కటంటే ఒక్క సీటుకు పరిమితమయ్యారు. గట్టి బలం ఉందనుకునే పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ఖాతా తెరవలేదు.
కొన్ని రాష్ట్రాలలో వామపక్షాల అభ్యర్ధులకు వచ్చిన వోట్ల కన్నా నోటా (ఏ అభ్యర్ధీ నచ్చలేదని చెప్పే వోటు) వోట్లే ఎక్కువ నమోదయ్యాయి. ఉదాహరణకు బీహార్లో ఎనిమిద లక్షలకు పైగా వోటర్లు నోటా మీట నొక్కారు. ఇది మొత్తం పోలయిన వోట్లలో 2 శాతానికి సమానం. అక్కడ మజ్లిస్ (0.72 శాతం), బిఎస్పి (1.67 శాతం), సిపిఎం (0.07శాతం) కన్నా కూడా ఈ నోటా వోట్ల శాతమే ఎక్కువ. బీహార్లోని 40 సీట్లలో బిజెపి, దాని మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) కలిసి 33 సీట్లు సంపాదించుకున్నాయి.
పంజాబ్లో 1.54 లక్షల వోటర్లు నోటా వోటు(1.12 శాతం) వేశారు. అక్కడ సిపిఐకి 0.31 శాతం, సిపిఎంకు 0.08 శాతం వోట్లు వచ్చాయి. రాజస్థాన్లో 3.28 లక్షల వోటర్లు నోటా ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో కూడా వామపక్షాలకు ఇంకా తక్కువ వోట్లు వచ్చాయి.
2019 ఎన్నికలలో 64 లక్షల మందికి పైగా వోటర్లు నోటా ఎంచుకున్నారు. ఇందులో బీహార్ రాష్ట్రం ముందుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే పంజాబ్ రాష్ట్రం, ఫరీద్కోట్లో అత్యధికంగా 19,246 మంది వోటర్లు నోటా నొక్కారు. ఢిల్లీలోని అన్ని సీట్లకూ కలిపి 45 వేల మంది వోటర్లు నోటా ఎంచుకున్నారు. లక్షద్వీప్లో అత్యల్పంగా వంద మంది వోటర్లు నోటా ఎంచుకున్నారు. అక్కడ బిజెపి అభ్యర్ధికి నోటా వోట్ల కంటే 25 మాత్రమే అధికంగా వచ్చాయి.