న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలిపారు. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తరహాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఆయన వెల్లడించారు. వివిధ మతాలకు చెందిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పౌరుల జాబితాలో ప్రతి ఒక్కరూ ఉండే విధంగా ఎన్ఆర్సీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. అస్సాంలో మరోసారి ఎన్ఆర్సీ చేపడుతామని చెప్పారు. అస్సాంలో కొద్ది రోజుల క్రితం విడుదలైన ఎన్ఆర్సీ జాబితా నుంచి 19 లక్షల మందిని తప్పించిన విషయం తెలిసిందే. వీరిలో చాలామంది తాము భారతీయులమేనని నిరూపించుకోలేకపోయారని, తగిన పత్రాలను సమర్పించలేకపోయారని ప్రభుత్వం పేర్కొంది. అయితే, తమ పేర్లు కనిపించనివారు ట్రిబ్యునల్స్ లో పిటిషన్లు దాఖలు చేయవచ్చు అని అమిత్ షా తెలిపారు. అస్సాంలో ఇందుకు వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుందన్నారు.