(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండవు, దశాబ్దాలుగా ఉన్నట్లు వాళ్లు బర్త్ సర్టిఫికెట్లు పెట్టుకుంటారా?” అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటించారు. సిఎఎ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సి) అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం ఏపీలో ఎన్ఆర్సీ ఉండదని ప్రకటించారు.
మరోవైపు కేరళ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తొలిసారిగా సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్రంగా కేరళ మొదటిస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. సీఏఏ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కుతో పాటు పలు ఆర్టికల్స్ను ఉల్లంఘిస్తోందని కేరళ ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలో ప్రాథమికంగా పేర్కొనే సెక్యులరిజమ్కు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని ఆ పిటిషన్లో కేరళ ప్రభుత్వం ఆరోపించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో ఇప్పటివరకు మొత్తం 60 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళతోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు అంటున్నాయి.
కాగా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సి), జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్)లను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.