వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు
ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం
గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం
న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం చెలరేగిన హింస ఫలితంగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని తక్షణం ఆపేయాలని ఎన్నికల పరిశీలకులు చేసిన సూచనను ఎన్నికల సంఘం పక్కన పెట్టిందని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్డీటీవీ ఒక కథనం ప్రచురించింది. అయితే, తుది గడువు విషయం చెప్పాల్సింది మాత్రం పరిశీలకులు కాదని ఎన్నికల సంఘం తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా అయితే శుక్రవారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం జరగాల్సి ఉండగా దాన్ని గురువారం రాత్రి 10 గంటలతోనే ముగించాలని ఎన్నికల సంఘం అసాధారణ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
బెంగాల్ అరాచకంగా తయారైందన్న తమ ఫిర్యాదు ఈసీ నిర్ణయంతో నిజమని తేలిందని బీజేపీ చెబుతుండగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ప్రధాని ర్యాలీల కోసం బీజేపీకి అప్రజాస్వామికంగా ఇచ్చిన బహుమతిగా ఈసీ నిర్ణయాన్ని అభివర్ణించారు. మోదీ ప్రచారం ముగుస్తూనే ప్రచార గడువు కూడా అయిపోతుందని, ఇది అనైతికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, పక్షపాతమని ఆమె మండిపడ్డారు.
ఎన్నికల సంఘానికి చెందిన కేంద్ర పరిశీలకులు బుధవారం ఇచ్చిన నివేదికలో ప్రచారాన్ని తక్షణం ఆపేయాలని సూచించినట్లు తన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ తెలిపింది. ‘‘ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పరిస్థితి తీవ్రతను చెప్పి, ఇక ఒక్క అవకాశం కూడా తీసుకోకూడదన్నారు. ప్రచారం వెంటనే, తక్షణం ఆపేయాలని అందులో సూచించారు’’ అని తన పేరు బయటపెట్టద్దని కోరిన అధికారి ఒకరు చెప్పారు. అయితే, ప్రచార గడువును మరికొంత పెంచాలని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారని తెలిసింది.
అయితే, పరిశీలకులు వెంటనే ప్రచారం ఆపేయాలని చెప్పారనడం వాస్తవ విరుద్ధమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘‘ఎన్నికల సంఘానికి డెడ్ లైన్లు సూచించాల్సిన పని పరిశీలకులది కాదు. వాళ్లను కేవలం క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదిక మాత్రమే కోరాం. 324వ అధికరణం ద్వారా ప్రచార గడువును కుదించాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయమే’’ అని తెలిపింది. ఈ నిర్ణయం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచింది.