శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5న వీరిని పోలీసులు హౌస్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించడానికి వీలు కల్పిస్తున్న 370 అధికరణాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు.. ప్రభుత్వం వీరిని హౌస్ అరెస్టు చేసింది. శ్రీనగర్ లోని హరినివాస్ లో ఉన్న ఒమర్ అబ్దుల్లా ఈ వారంలో రెండు సార్లు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. ఒమర్ సోదరి సఫియా, ఆమె పిల్లలు ఆయనతో 20 నిముషాలు భేటీ అయ్యారు. అలాగే మెహబూబా ముప్తీ తల్లి, సోదరి ఆమెను గత నెల 29న కలుసుకున్నారు. ముఫ్తీని టూరిజం శాఖకు చెందిన ఓ భవనంలో నిర్బంధించారు. దీన్ని ఇటీవల సబ్-జైలుగా మార్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ను సైతం హౌస్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లాకు కనీసం టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా అధికారులు సమకూర్చలేదు. గత కొన్నివారాల్లో ఇద్దరు సీనియర్ అధికారులు మూడు సార్లు ఆయనతో భేటీ అయ్యారు. కానీ తన కుమారుడిని కలుసుకునేందుకు ఆయనను అనుమతించలేదు. అటు-ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తీ లను న్యూస్ చానెళ్లకు దూరంగా ఉంచారు. సినిమాలు చూసేందుకు ఒమర్ కు అధికారులు డీవీడీ ప్లేయర్ ను అందజేయడం విశేషం. కాశ్మీర్లో ఆంక్షలను ప్రభుత్వం క్రమేపీ ఎత్తివేస్తున్నప్పటికీ వీరిని త్వరలో విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు. వీరిని విడుదల చేస్తే మరిన్ని ఓట్లను సాధించగలుగుతారని కాశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఇటీవల జోక్ చేశారు.