(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక గ్రామ పంచాయతీ పెద్ద సభ్య సమాజం తలదించుకునేలా మైనర్ బాలికను ఇష్టానుసారంగా దండించిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పోలీసు అధికారులు, బాలల హక్కుల సంఘం నేతలు స్పందించారు.
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపిదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెద్దలు వారి ప్రేమను అంగీకరించరని భావించి పది రోజుల క్రితం గ్రామం విడిచి పారిపోయారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని స్వగ్రామానికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అక్కడ పెద్దల మాట విననందుకు మైనర్ బాలికను గ్రామ పెద్ద దారుణంగా కొట్టారు. ముందుగా చేతులతో తరువాత కాళ్లతో, కర్రతో కొట్టి పాశవికంగా ప్రవర్తించారు. ఆ తరువాత యువకుడినీ కొట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చుట్టూ పోగై ఉన్నా ఎవరూ ఏమి మాట్లాడలేదు. అడ్డుకోవడానికీ ప్రయత్నించలేదు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో బాలల హక్కుల సంఘం నేత అచ్చుతరావు స్పందించారు. దీనిపై కేసు నమోదు చేసేందుకు జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.
గ్రామ పెద్దపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని జిల్లా ఎస్పి బి యేసుబాబు తెలిపినట్లు ఎన్డిటివి పేర్కొన్నది. బాధిత బాలిక ఫిర్యాదు చేస్తుందో లేదో తెలుసుకునేందుకు మహిళా కానిస్టేబుల్ను గ్రామానికి పంపారు. ఆ మైనర్ బాలికతో యువకుడికి శారీరక సంబంధం ఉందని తెలిస్తే ఆ యువకుడిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్యవల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.