(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశంలో జమిలి ఎన్నికలు అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తెరపైకి తెచ్చింది. లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా సొమ్ము, సమయం ఆదా అవుతాయని మోదీ సర్కారు భావిస్తోంది. అయితే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టమని నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారట. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఓ కథనం రాసింది.
2016 మార్చి 19న ప్రధాని మోదీ… జమిలి ఎన్నికల ప్రస్థావన తెచ్చారు. దీనిపై ఏర్పాటు అయిన మంత్రుల కమిటీ అంతర్గత సమావేశంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది.
2019 ఎన్నికల నేపథ్యంలో కొత్త ఈవీఎంలు, వీవీపాట్ల కొనుగోలు చేసేందుకు రూ.5,200 కోట్లు ఖర్చు అవుతుందని ఎలక్షన్ కమిషన్ అంచనా వేసింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపైనా చర్చించేందుకు 2016 ఏప్రిల్ 11న మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. సమావేశంలో కేంద్ర మంత్రులతోపాటు పలువురు అధికారులు హాజరైయ్యారు. అయితే, సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహిండంపై కష్టమేమని, కొన్ని ఇబ్బందులు వస్తాయని అప్పటి ఆర్థిక మంత్రి జైట్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఆయన తెరపైకి తెచ్చారు.
అయితే, దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరగాలని అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టారని, జమిలి ఎన్నికలపై వివిధ పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలని సుష్మా అన్నారు. ఈ కమిటీకి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నాయకత్వం వహించారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.
ఒక దేశం- ఒకే ఎన్నికలు అంశంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన సమావేశంలో మొత్తం 24 పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, అన్నాడిఎంకె, శివసేన, ఆర్జేడి, ఎస్పీ, బిఎస్పీ, టిడిపి, జెడిఎస్, ఆప్, కేరళ కాంగ్రెస్(ఎం) వంటి పార్టీలు గైర్హాజరైయ్యాయి.
ఇదిఇలా ఉంటే.. అభివృద్ధిని పరుగులు తీయించాలన్న తన లక్ష్యానికి తరచూ ఎన్నికలవల్ల గండి పడుతోందని మోదీ గట్టిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలను ఆయన తెరపైకి తెచ్చారు. బిజెపి సీనియర్ నేత ఎల్కె అద్వానీ కూడా 2011లో ఇదే పాట పాడారు. ఇటీవల 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్వరలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయంగా భావిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. ఈ అంశంపై వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా సేకరించింది. చాలా పార్టీలు మద్దతు తెలపగా.. కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. నిజానికి 1951-52, 1957, 1962, 1967లో లోక్సభ ఎన్నికలతోపాటే… రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత నుండి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం ప్రారంభమైంది.