అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతుల ఆందోళనల్లో రాంబాబు పాల్గొన్నారు. రాజధాని తరలిపోతుందనే మనస్తాపంతోనే ఆయన చనిపోయాడని బంధువులు వెల్లడించారు. రాంబాబు భౌతిక కాయాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సందర్శించి, నివాళులు అర్పించారు. రాంబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ఇప్పటికే రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో పలువురు రైతులు, రైతు కూలీలు మృతి చెందారు.
మరోవైపు రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 44వ రోజుకు చేరాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. స్థానిక రైతులే కాకుండా పలువురు ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మందడంలో ఏర్పాటు చేసిన 24 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రారంభించారు. రాజధాని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకొని నిరాహారా దీక్ష చేపట్టారు.