ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ అభిప్రాయాన్ని మార్చాలంటే పుల్వామా లాంటి ఘటనలు జరగాలని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా మోదీ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండేవారని.. కానీ పుల్వామా ఘటన తరువాత పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని సమూలంగా మార్చివేశాయని తెలిపారు. ఇప్పుడు మరో పుల్వామా తరహా ఘటన సంభవిస్తే తప్పా… మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి గెలవలేదని అన్నారు. గత ఐదేళ్లలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్సీపీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు కుదిరిందని.. బహుజన్ వికాస్ అఘాదీ, సమాజ్వాదీ పార్టీ లాంటి చిన్న పార్టీలను కలుపుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పొత్తుల్లో భాగంగా రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనతో కలవడానికి ఎన్సీపీ సిద్ధంగా ఉందని.. కానీ కాంగ్రెస్ అందుకు ఒప్పుకోవడం లేదని శరద్ పవార్ తెలిపారు. ఇక తమ పార్టీ నుంచి బీజేపీ, శివసేనలోకి వెళుతున్న వారందరూ అవకాశవాదులని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి చట్టబద్ధ సంస్థల్ని దుర్వినియోగం చేసిందని పవార్ ఆరోపించారు.
మరోవైపు మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదలకానుంది. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఫలితాలు విడుదలకానున్నాయని ఈసీ ప్రకటించింది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 8.94 కోట్లు, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.