ఈసీకి ఆప్, కాంగ్రెస్ పార్టీల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ‘నమో టీవీ’పై కాంగ్రెస్, ఆప్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాలు, కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలు ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా ఈ చానల్ మొదలైంది. ఇది అన్ని డీటీహెచ్ ప్లాట్ ఫారాలు, కేబుల్ టీవీ నెట్ వర్కులలో వస్తోంది. మోదీ పేరు మీద ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. ఇవి కాక ఇంకా ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలను వెబ్ కాస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ఇంటర్ నెట్ టీవీ చానల్ ఒకటుంది. ఈ టీవీ నాళ్లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందంటూ కపిల్ సిబల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లింది.
తాము ఎన్నికల కమిషన్ కు మూడు వినతిపత్రాలు సమర్పించామని, దూరదర్శన్ దుర్వినియోగంపై రెండు, బీజేపీ చానళ్ల మీద మరొకటి ఇచ్చామని సిబల్ తెలిపారు. అక్రమంగా బీజేపీ ప్రచారాలు మాత్రమే చేయడానికి నమోటీవీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఇలా ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆయన చెప్పారు. అలాగే, పార్టీలు సొంత టీవీ చానళ్లు పెట్టుకోవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమా అని ఆప్ కూడా ఈసీని కోరింది. ఎన్నికల కమిషన్ అలాంటి అనుమతి ఇవ్వకపోతే చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
తమకు నమోటీవీపై ఫిర్యాదు అందిందని, దానిపై విచారణ జరుపుతున్నామని ఈసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, తమకు ప్రత్యేకంగా ఒక టీవీ చానల్ అవసరమని బీజేపీ నాయకుడొకరు అన్నారు. ప్రైవేటు టీవీ చానళ్లు ప్రధాని ప్రసంగాలు వస్తుంటే వేరే కార్యక్రమాలు చూపిస్తున్నాయని, అందుకే దీన్ని కేవలం మోదీ ప్రసంగాలకే కేటాయించారని చెప్పారు. ఈ చానల్ ను బాగా ప్రచారం చేయాలని, తద్వారా ఎక్కువ మందికి పార్టీ విషయాలు తెలుస్తాయని కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సూచించారు.