(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: శాసనమండలిలో ప్రత్యక్ష ప్రసారాలు పునరుద్ధరించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కౌన్సిల్ చైర్మన్, ప్రతిపక్ష నేత చాంబర్లలో ఎందుకు లైవ్ ప్రసారాలు రావడం లేదని టిడిపి సభ్యులు నిలదీశారు. టిడిపికి మద్దతుగా ఇతర విపక్ష సభ్యులు గొంతు కలిపారు. సాంకేతిక సమస్య తలెత్తిందని మంత్రులు చెబుతున్నారు. గంటలో లైవ్ ప్రసారాలు పునరుద్ధరణ జరుగుతుందని తెలియజేశారు. దీనికి వివక్ష సభ్యులు అంగీకరించలేదు. లైవ్ ప్రసారాలు పునరుద్ధరించాకే చర్చ ప్రారంభిద్దామని విపక్ష సభ్యులు పేర్కొన్నారు. దీంతో చైర్మన్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
అంతకు ముందు బిల్లులకు మూడు సవరణలు ప్రతిపాదించిన టిడిపి.. సెలక్టు కమిటీకి పంపాలని చైర్మన్కు లేఖ రాసింది.వికేంద్రీకరణ బిల్లుపై చర్చను పిడిఎఫ్ సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. శాసన, పరిపాలన వ్యవస్థలను కకలిపి ప్రభుత్వం అంటారనీ, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై అభ్యంతరంలేదనీ లక్ష్మణరావు అన్నారు. సచివాలయం, అసెంబ్లీ ఇతర వ్యవస్థలు అమరావతిలోనే ఉండాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు.